సినీ నటుడు పోసాని కృష్ణమురళి
హైదరాబాద్: “కనీసం ఐదారు కి.మీ. కూడా నడవలేని పవన్.. రాష్ట్ర వ్యాప్తంగా వేల కి.మీ. నడిచిన జగన్తో పోల్చుకుంటారా? ప్రభుత్వ పాఠశాలలు ఎలా మార్పు చెందాయో ఎప్పుడైనా చూశారా? విద్యార్థులకు అన్నీ ఉచితంగా ఇవ్వటంతో పాటు, స్కూల్కు వెళ్లిన వాళ్లకు జగన్ ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తోంది. చంద్రబాబు రూ.2లక్షల కోట్ల అప్పులు చేసి, జగన్కు వదలి వెళ్లారు. వాటిని తీరుస్తూ, వడ్డీలు కడుతూ, కొత్త అప్పులు తెస్తూ, ప్రజల సంక్షేమాన్ని చూసుకోవటం మామూలు విషయం కాదు. చంద్రబాబులా జగన్ ఏమీ విదేశీ పర్యటనలు చేయలేదు” అని సినీ నటుడు, వైకాపా కార్యకర్త పోసాని కృష్ణమురళి అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, కక్ష కట్టి మాట్లాడటం సరికాదు. పవన్ వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మిమ్మల్ని కేసీఆర్ బహిరంగంగా హెచ్చరించిన సంగతి గుర్తులేదా? అని ప్రశ్నించారు. నాకు ఎవరూ శత్రువులు లేరు. నేను జగన్ అభిమానిని. ఆయనను ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది. మీ అభిమానుల్లా నేను అసభ్య పదజాలంతో మాట్లాడను. ఏది మాట్లాడినా మీడియా ముందే మాట్లాడతా! నేను మిమ్మల్ని ప్రశ్నించినందుకు నిన్న రాత్రి నుంచి కొన్ని వేల ఫోన్ కాల్స్, మెస్సేజ్లు వచ్చాయి’’ అన్నారు. ‘‘పవన్కల్యాణ్ ప్రజల మనిషి కాదు. ఇండస్ట్రీ మనిషి అంతకన్నా కాదు. కేవలం తనని తాను ప్రేమించుకుంటారు. పవన్ ప్రతి పార్టీని విమర్శించే పని పెట్టుకున్నారు. కొన్నాళ్లు తెదేపాను, ఇంకొన్నాళ్లు భాజపాను, ఇప్పుడు వైకాపాను విమర్శిస్తున్నారు. వామపక్షాలతో కలిసి పనిచేశారు. ఎప్పుడైనా వాళ్లతో కలిసి ఆలోచనలను పంచుకున్నారా’’ అని విమర్శించారు.
కొంచెం విజ్ఞతతో మాట్లాడండి.. ‘‘ఒకవేళ నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేస్తే, ఒక్క మాట కూడా మాట్లాడను. ఎందుకంటే నిర్మాతలు అక్షయ పాత్రలు. వాళ్ల పుణ్యంతోనే మేము అన్నం తింటున్నాం. హీరోలు, హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. నాకూ చిరంజీవికి రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉన్నా, వ్యక్తిగతంగా మంచిగానే ఉంటాం. ఏం చెప్పినా, విని అర్థం చేసుకునే పరిణతి ఆయనకు ఉంది. చంద్రబాబు పార్టీ మనషులు చిరంజీవి కుటుంబాన్ని విమర్శించారు. నువ్వు మాట్లాడావా? నేను మాట్లాడా. చిరంజీవి కోసం చచ్చిపోవడానికి సిద్ధమని నేను చెప్పాను. ఎక్కడ ప్రశ్నించాలి? ఎప్పుడు ప్రశ్నించాలి? నీకు తెలియదు. మిమ్మల్ని మారమని నేను చెప్పడం లేదు. మీరు మారరని నాకు తెలుసు. అయితే, కొంచెం విజ్ఞతతో మాట్లాడండి. మీరు అలా మాట్లాడితే, వీళ్లు ఇలా మాట్లాడతారు. మీరు మాట్లాడిన దాంట్లో ఒక్క నిజమైనా ఉందా? పెద్ద హీరో అయిన మీరు అలా అనిపించుకోవడం బాగుందా? జగన్ పార్టీలో ఎవరైనా సరిగా పనిచేయకపోతే నేనే ఫోన్ చేసి చెబుతా. మీ రెమ్యునరేషన్ ఎంతో కూడా చెప్పలేకపోయారు. ‘కనీసం 10 అనుకోండి’ అన్నారు. 10 కాదు 15 ఇస్తా నాలుగైదు సినిమాలు చేస్తారా? మీ రెమ్యునరేషన్ రూ.50కోట్లు కాదా? అబద్ధమైతే చెంప పగలకొట్టండి’’ అని సవాల్ విసిరారు.
‘‘చిరంజీవిగారు పార్టీ పెట్టిన కొత్తలో అవినీతి గురించి మాట్లాడుతున్నారు. ఆయనను అప్రతిష్టపాలు చేద్దామని కొందరు తెదేపా నాయకులు అనుకున్నారు. చిరంజీవి కుమార్తె గురించి, వ్యక్తిగతం గురించి లైవ్లో ఘోరంగా మాట్లాడారు. ఈ విమర్శలు చిరుకు తెలిసి అన్నం తినకుండా వ్యాన్లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి కన్నబాబు అప్పుడు ప్రజారాజ్యంలో ఉన్నారు. ఆయన నాకు సన్నిహితుడు. కన్నబాబుగారు నాకు ఫోన్ చేశారు. జరిగింది చెప్పారు. నేను ‘అన్నయ్యకు ఫోన్ ఇవ్వండి’ అంటే ఆయనకు ఇచ్చారు. ఆయన గద్గద స్వరంతో ‘పోసాని.. రాజకీయాలకు, నా భార్యాబిడ్డలకు ఏం సంబంధం’ అని వాపోయారు. వెంటనే ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్కు వెళ్లి, ప్రెస్మీట్పెట్టి కేశినేని నానిపై ప్రశ్నల వర్షం కురిపించా. అంతే అటు వైపు నుంచి సమాధానం రాలేదు. అప్పుడు చిరంజీవి సన్నిహితులతో ‘పోసాని నా గుండెల్లో ఉన్నారు’ అని అన్నారట. ఆరోజు మీ అన్నయ్య కుటుంబాన్ని వాళ్లు అన్నేసి మాటలు అంటే పవన్కల్యాణ్, ఆయన అభిమానులు ఎక్కడ ఉన్నారు? బయటకు వచ్చి ప్రశ్నించలేదే? బెల్లంకొండ సురేశ్గారు చిరంజీవిని ఏదో అన్నారని, అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘ఇది సినిమా ఇండస్ట్రీ విషయం మీకు సంబంధం లేదు’ అని చిరంజీవి వారిపై కేకలేసి పంపించివేశారు. మంచు విష్ణు నామినేషన్ వేయడానికి వెళ్తే, అక్కడకు కూడా 10మంది పవన్ ఫ్యాన్స్ వచ్చారట. పవన్కల్యాణ్.. నీ ఫ్యాన్స్కు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. ఇక నుంచి రాజకీయాల్లో నా గురించి మాట్లాడు. నన్ను టార్గెట్ చెయ్. నాది తప్పు అయితే, నీకు దండం పెడతా. అంతేకానీ, నా కుటుంబ సభ్యులను ఈ వివాదంలో లాగొద్దు. చిరంజీవిగారు మీ తమ్ముడిని అదుపులో పెట్టుకోండి.’’ అని పోసాని కృష్ణమురళి అన్నారు.
పోసాని ప్రెస్క్లబ్ వద్దకు వచ్చిన విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు భారీగా అక్కడి చేరుకున్నారు. పోసానిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పోసానికి వ్యతిరేకంగా పవన్ అభిమానులు నినాదాలు చేశారు. అరెస్టు చేసిన ఆందోళనకారులను పంజాగుట్ట పోలీస్స్టేషన్కు తరలించారు. పోసానిని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసులు, అనంతరం పోలీసు వాహనంలోనే ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా పోసాని మీడియాతో మాట్లాడుతూ ‘‘పవన్ అభిమానుల నుంచి నాకు ప్రాణహాని ఉంది. నేను చనిపోతే అందుకు పవన్ కల్యాణే కారణం. అతనిపై రేపు పోలీసులకు ఫిర్యాదు చేస్తా’’ అని తెలిపారు.